Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మహా కుంభాభిషేకం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు జగద్గురు పీఠాధిపతి పండితారాధ్య చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు. శనివారం శ్రీశైలం దేవస్థాన పరిపాలన భవనంలో ఈవో లవన్న ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ మే 25 నుండి 31 వరకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహా కుంభాభిషేకానికి రావాలని సీఎం వైఎస్ జగన్, ప్రధానమంత్రి నేంద్రమోదీకి ప్రత్యేక ఆహ్వానాలు అందజేస్తామన్నారు.
ఉత్తరాయణ కాలంలో ఆలయ ఉత్తర ద్వారమైన శివాజీ గోపురంపై కలశ స్థాపన చేస్తామని చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి తెలిపారు. కలశ స్థాపన, శాస్త్రోక్త పూజలు, వీరశైవ-స్మార్థాగమ పద్దతుల ప్రకారం ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు, ఆలయ స్థానాచార్యులు, ఆగమ పండితులు, వేదపండితులకు తగిన గౌరవ మర్యాదలు సంప్రదాయబద్దంగా జరిగేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈవోను కోరారు. గత కొంత కాలంగా పంచ మఠాల పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. పునరుద్ధరణ పనులు పూర్తయిన మఠాలలో శివలింగ పున:ప్రతిష్ఠ చేస్తామన్నారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి, ఉగాది మహొత్సవాలు ఘనంగా జరిపించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈవో లవన్న అభినందనలు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలతోపాటు వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిగా తరలివచ్చిన యాత్రికులకు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనంతోపాటు అవసరమైన వసతులు కల్పనలో దేవస్థానం అధికారులు సిబ్బంది చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. జిల్లా, క్షేత్ర స్థాయి వరకు పోలీస్, రెవిన్యూ, ఆరోగ్య శాఖల సిబ్బందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మ వార్ల హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ఠ నిఘా మధ్య ఆలయ సిబ్బందితోపాటు శివ సేవకులు.. ఉభయ దేవాలయాలు, పరివార దేవతాలయాల హుండీలను లెక్కించారు. తొమ్మిది రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో రూ.2,70,51,419 కానుకలు సమర్పించారని ఈవో లవన్న తెలిపారు. వీటితోపాటు 995 అమెరికా డాలర్లు, రెండు సౌదీ రియాల్స్, 30 న్యూజిల్యాండ్ డాలర్లు తదితర విదేశీ కరెన్సీ.. స్వామి అమ్మవార్లకు మొక్కులుగా సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.