Madhusudhan Reddy | ఫైబర్ నెట్ మాజీ ఎండీ మధుసూదన్ రెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను నియమించినట్లు ఆరోపణలున్నాయి. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జీవో విడుదల చేసింది. ఆయన కేంద్ర సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని.. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ప్రభుత్వం ఆరోపించింది. ఇక మధుసూదన్రెడ్డిని హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని సదరు జీవోలో స్పష్టం చేసింది.
అయితే, ఫైబర్ నెట్లో అక్రమాలకు సంబంధించి కేసు విచారణ జరుగుతున్నందున మధుసూదన్ రెడ్డి అందుబాటులో ఉండడం అవసరమని.. ఈ మేరకు ఆయన డిప్యూటేషన్ను మరో ఆరు నెలలు పొడిగించాలని ఏపీ సర్కారు రైల్వే బోర్డుకు రాసిన లేఖలో విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి ఏపీలో మధుసూదన్రెడ్డి డిప్యూటేషన్ ఈ నెల 22తో ముగియనున్నది. ఆయన 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్స్ సర్వీస్ నుంచి ఏపీకి డిప్యూటేషన్పై వచ్చారు. ప్రస్తుతం ఫైబర్ నెట్లో అక్రమాలపై విచారణ నేపథ్యంలో ఆయనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విచారణ విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట్రెడ్డి డిప్యూటేషన్ను పొడిగిస్తూ భారత కోస్ట్గార్డ్ హెడ్క్వార్టర్స్ నుంచి ఏపీ సర్కారుకు లేఖ అందింది.
వెంకట్రెడ్డిపై సైతం అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతున్నది. ఏపీ ప్రభుత్వం రాసిన లేఖ మేరకు ఈ నెల 31 వరకు ఆయన డిప్యూటేషన్ను పొడిగించినట్లు సీఎస్కు రాసిన లేఖలో కోస్ట్గార్డ్ కార్యాలయం తెలిపింది. ఈ విషయంలో కేంద్రానికి సైతం ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. సర్వీస్ నిబంధనల ఉల్లంఘనపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని.. ఆయన ఈ నెల 31 పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది. ఆ తర్వాత చర్యలు ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని సీఎస్కు రాసిన లేఖలో చెప్పింది. గనులశాఖలో అక్రమాలపై వెంకట్రెడ్డిని ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసిన విషయం విధితమే.