అమరావతి : ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లి గూడెం గ్రామీణ మండలంలో దారుణం చోటు చేసుకుంది. యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డ ప్రేమోన్మాది ఆమెను, ఆమె చెల్లెలు, తల్లిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మండలంలోని కొండ్రుప్రోలుచెందిన రాజులపాటి కల్యాణ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. రెండు నెలల క్రితం గ్రామ పెద్దల సమక్షంలో యువతి తండ్రి కల్యాణ్ను బెదిరించి పంపించివేశారు.
అయితే గురువారం రాత్రి యువతి నిద్రపోతుండగా ప్రేమోన్మాది ఆ ఇంటిలోకి చొరబడి ఆమెపై దాడి చేసి గొంతుకోశాడు. అడ్డువచ్చిన చెల్లెలు, తల్లిపై కత్తితో దాడిచేసి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావమై బాధపడుతున్న ముగ్గురిని స్థానికులు హుటాహుటినా ఆస్పత్రిలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తాడెపల్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వివరించారు.