Kisan credit card : గ్రామీణ మహిళల కోసం ఏపీ ప్రభుత్వం ఓ అద్భుతమైన పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద ఒక్కో మహిళ ఏకంగా రూ.1.62 లక్షల వరకు రుణం పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణతో ఉపాధి పొందుతున్న మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం సర్కారు పశు కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చింది.
ఈ పథకం ద్వారా మహిళా పాడి రైతులు లబ్ధి పొందవచ్చు. పథకంలో భాగంగా ఒక్కో పాడి రైతు రూ.1.62 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. నంద్యాల జిల్లావ్యాప్తంగా పదివేల కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొని అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులు ఎవరైనా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ పశు వైద్య కార్యాలయానికి వెళ్లి అప్లై చేసుకోవాలి.
అక్కడి నుంచి జిల్లా కార్యాలయానికి పంపించిన దరఖాస్తులను జిల్లా అధికారులు లీడ్ బ్యాంకు మేనేజర్కు పంపిస్తారు. వారు పరిశీలన చేశాక లోన్ సదుపాయం కల్పిస్తారు. ప్రతి మండలంలో దాదాపు 300 మంది మహిళా పాడి రైతులకు ఈ పథకంలో చేరడానికి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ స్కీమ్లో చేరి బెనెఫిట్ను పొందవచ్చు. ఈ పథకం కింద అర్హులైన రైతుల ఖాతాలకు బ్యాంక్ అధికారులు నగదు జమ చేస్తారు.
రైతులు పశు పోషణకు కావలసిన వాటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తారు. క్రెడిట్ కార్డు ద్వారా పొందిన రుణాన్ని 40 రోజుల్లో తిరిగి జమచేస్తే ఏ వడ్డీ కూడా ఉండదు. అదే ఒకవేళ చెల్లించకపోతే ఏడు శాతం వడ్డీతో తర్వాత చెల్లించవచ్చు. అందులో ప్రభుత్వం మూడు శాతం రాయితీ ఇస్తుంది.