భీమవరం: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తూర్పు గోదావరి జిల్లాలో లోన్ యాప్ వేధింపులతో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భీమవరంలో జరిగింది. లోన్ యాప్ వేధింపుల కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆ యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన సమాచారం మేరకు, కడియంకు చెందిన సతీష్ అనే యువకుడు ఓ లోన్ యాప్ నుంచి రుణం తీసుకున్నాడు. పలు ఈఎంఐలు చెల్లించాడు. పెద్ద మొత్తంలో వడ్డీ వేయడంతో కిస్తీలు చెల్లించలేని స్థితికి చేరుకున్నాడు. దాంతో రుణం మొత్తం చెల్లించాల్సిందే అంటూ లోన్ యాప్ నిర్వాహకులు ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో సర్కులేట్ చేశారు. దీంతో సతీష్ తీవ్రమనస్తాపానికి గురై భీమవరంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తగ్గలేదు. ఫోన్ చేసి బూతులు తిడుతున్నారని, నిన్న ఒక్క రోజే 30 సార్లు మెసేజ్ పెట్టారని బాధితుడు సతీష్ సోదురుడు సాయి చెప్పాడు. తాము కట్టాల్సింది యాప్ నిర్వాహకులు ఎంతో చెప్పడంలేదని, ఆ మొత్తం ఎంతో వారికే తెలియదన్నారు. తల్లి, సోదరిపై లైంగికదాడి చేసి పారిపోయాడని సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోలు పెట్టి ప్రచారం చేస్తున్నారని చెప్పాడు. వీరి పుకార్లకు మనస్థాపం చెంది సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపాడు. సోదరుడి బూతు ఫొటోలు మాకు పంపుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మీకూ ఇలాంటి గతే పడుతుందని మా సోదరిని బెదిరించారిన సాయి చెప్పాడు.