శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. జలాశయం నిండు కుండలా మారింది. ఈ క్రమంలో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గేట్ల నుంచి వరద నీరు పాల ధారలా ఉప్పొంగింది. ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గేట్లను ఎత్తిన తర్వాత ఆ జల దృశ్యాన్ని పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు.
ఇక శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమక్షంలో ఎత్తారు. అంతకుముందు కృష్ణమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాజెక్టు 6, 7, 8 నంబర్ల గేట్లను ఎత్తి 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ వైపు పరవళ్లు తొక్కుతోంది. జులై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తేయడం.. 12 ఏండ్లలో ఇది మూడోసారి.
ప్రాజెక్టుకు 1,11,970 క్యూసెక్కుల నీరు వస్తుండగా 57,751 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 882.50 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కెసాసిటీ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 202.04 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.