తిరుమల : సమసమాజ స్థాపన కోసం పాటు పడిన డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ (Babu Jagjeevan Ram) జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, వారి ఆశయాలను సాధించేందుకు కృషి చేయాలని జేఈవో వీరబ్రహ్మం (JEO Veerabraham) కోరారు. జగ్జీవన్రామ్ 117వ జయంతి వేడుకలను తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ నిమ్నకులంలో జన్మించిన బాబు జగ్జీవన్రామ్ డబ్బు లేకపోయినా, కులవివక్ష ఎదురైనా వాటిని అధిగమించారని, కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగి భారత ఉప ప్రధాని(Deputy Prime Minister) పదవిని అలంకరించారని తెలిపారు. భారత రాజకీయాలలో క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీతో వివిధ మంత్రి పదవులకు వన్నెతెచ్చి భావితరాలకు ఆదర్శంగా నిలిచారన్నారు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు, అటుతరువాత సమాజంలో సమస్యలను అధ్యయనంచేసి, వాటి పరిష్కారానికి తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. స్వాతంత్య్రానంతరం మొదటి కార్మిక శాఖ మంత్రి(Labour Minister) గా కార్మికుల అభ్యున్నతి కోసం పలు చట్టాలు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమానికి డిప్యూటీ ఈవోలు స్నేహలత, దేవేంద్రబాబు, టీటీడీ ఉద్యోగులు పాల్గొన్నారు.