తిరుపతి : వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవడానికి ప్రతిజ్ఞ చేసి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని టీటీడీ చైర్మన్((TTD Chairman ) భూమన కరుణాకర రెడ్డి( Karunakar Reddy) పిలుపునిచ్చారు. తిరుపతి(Tirupati)లోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం కనుమ పండుగ ( Kanuma Festival) సందర్భంగా గో మహోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు గోపూజ కార్యక్రమాన్ని టీటీడీ చేపట్టినట్టు తెలిపారు. తిరుపతి, పలమనేరులోని గోశాలల్లో 2,500కు పైగా గోవులు ఉన్నట్లు చెప్పారు. తిరుమల(Tirumala) శ్రీవారి ఉత్సవాలలో, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాల్లో, స్థానిక ఆలయాలలో జరిగే ఉత్సవాలలో గో శాలలోని ఏనుగులు, అశ్వాలు, వృషబాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయన్నారు.
తిరుమల శ్రీవారికి దేశీయ గో జాతుల పాల నుంచి తీసిన వెన్నను సమర్పిస్తున్నట్లు వెల్లడించారు. పూర్వకాలం నుంచి కనుమ పండుగ రోజున గోపూజకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు. ఇప్పటి వరకు దాతలు రూ.250 కోట్లకు పైగా ‘‘ఎస్వీ గో సంరక్షణట్రస్టు” కు విరాళాలు అందించినట్లు వివరించారు. గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి గౌరిపూజ, తులసిపూజ లో పాల్గొన్నారు. గజరాజులు, అశ్వాలు, వృషభాలు, గోవులకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించి, దాణా అందించారు.