తాడేపల్లి: వీలైనంత తక్కువ వడ్డీకి సహకార బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సహకార బ్యాంకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. రాష్ట్రంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పనితీరుపై సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతానికి తీసుకున్న, తీసుకుంటున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా డీసీసీబీలు, సొసైటీల బలోపేతం, కంప్యూటరీకరణ, పారదర్శకత విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై చర్చించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
నాణ్యమైన రుణ సదుపాయం ఉంటేనే, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తేనే ప్రజలు, రైతులకు మేలు జరుగుతుందని జగన్ అన్నారు. తక్కువ వడ్డీకే రుణాలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాంకింగ్ రంగంలో పోటీని తట్టుకుని నిలబడేలా డీసీసీబీలు, సొసైటీలను సిద్దం చేయాలన్నారు. ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకి బంగారంపై రుణాలు ఇవ్వడం వల్ల ఖాతాదారులను తమవైపు తిప్పుకోవచ్చని, తద్వారా ఖాతాదారులు, సహకార బ్యాంకులకు ప్రయోజనం చేకూరుతుందని సూచించారు.
రుణాల మంజూరులో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, రాజకీయాలకు తావులేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర సహకార బ్యాంకుల కార్యకలాపాలు అవినీతికి, సిఫారసులకు తావివ్వకుండా చూడాలని ఆదేశించారు. ఖాతాదారుల్లో విశ్వాసం నింపేలా సహకార బ్యాంకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేలలోని కియోస్క్లను బ్యాంకింగ్ కార్యకలాపాల్లో వినియోగించుకోవాలని సీఎం జగన్ సూచించారు. సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.