ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంపై తెలుగు అకాడమి చైర్పర్సన్, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ఒక జిల్లాకే ఆ మహానీయుడు పేరు పెట్టగా.. యూనివర్శిటీది ఏముంది అంటూ ప్రశ్నించారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును ఎందుకు మారుస్తున్నారో సీఎం జగన్ అసెంబ్లీలో అంత వివరంగా చెప్పినా ఆందోళనలు చేయాలని చూడటం విచారకరమన్నారు. ఎన్టీఆర్కు ద్రోహం చేసినవారు ఇప్పుడు ఆయన గురించి మొసలికన్నీరు కారుస్తున్నారన్నారు. ఎన్టీఆర్తో తన పెండ్లిపై కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరోగ్య విశ్వవిద్యాలం పేరు మార్పును నిజమైన ఎన్టీఆర్ అభిమానులు బాధపడితే ఓకే కానీ ఎన్టీఆర్ హత్యకు కారణమైన వారు బాధపడుతున్నట్లు నటిస్తున్నారని లక్ష్మీపార్వతి ద్వజమెత్తారు. చంద్రబాబు 14 ఏండ్ల పాలనలో ఒక్క పథకానికైనా శాశ్వతంగా ఎన్టీఆర్ పేరు పెట్టారా? అని ప్రశ్నించారు. అలా ఒక్క పేరు కూడా పెట్టని నాయకులు ఇప్పుడు యూనివర్శిటీ పేరు మార్పుపై దొంగ బాధను వొలకబోస్తున్నారని మండిపడ్డారు. అంతపెద్ద జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెడితే యూనివర్శిటీ గురించి ఆలోచించడమేంటో అని అన్నారు. ఎన్టీఆర్కు ద్రోహం చేసిన వారు ఇప్పుడు బాధపడుతున్నట్లు నటిస్తున్నారని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు తనపై అసత్య కథనాలు ప్రచురిస్తున్నాయని విచారం వ్యక్తం చేసిన లక్ష్మీపార్వతి.. ఇదంతా పనిగట్టుకుని తనను కించపరిచేందుకు చేసే ప్రయత్నమే అన్నారు.
చరిత్రను ఎవరూ చెరిపివేయలేరని లక్ష్మీపార్వతి చెప్పారు. తాను పదవి కావాలని ఎన్టీఆర్ను ఏనాడూ అడగలేదని, టెక్కలి నుంచి పోటీ చేయాలని అప్పట్లో తనను ప్రజలు కోరారని తెలిపారు. తన పెండ్లి గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబుకు తమ పెండ్లంటే ఇష్టం లేదని, మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని చెప్పారు. తమ పెండ్లి గురించి తప్పుడు మాటలు మాట్లాడతే ఈసారి కేసు పెడతానని హెచ్చరించారు.