కర్నూలు జిల్లా : టమాట చేనులో కలుపు తీస్తుండగా ఓ అనుకోని అతిథి రైతుకు ఎదురుపడింది. దాంతో ఆ రైతు సుడి తిరిగిపోయింది. అంత గొప్పగా చెప్పుకుంటున్న ఆ అతిథి ఎవరో కాదు.. ఎంతో విలువైన వజ్రం. ఇదెక్కడో జరిగింది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో.
కర్నూలు జిల్లాలోని జీ ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు తనకున్న చేనులో టమాట పండిస్తున్నాడు. చేనులో కలుపు తీసే పనులు చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది. ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రంలా తోచింది. దాంతో ఆ రైతు తన కష్టాలు తీరిపోయాయని సంబరపడిపోయాడు. ఆ రాయిని పరిశీలించేందుకు జీ ఎర్రగుడికి సమీపంలోని కొందరు వ్యాపారులను సంప్రదించగా.. అది 10 క్యారెట్ల బరువైన వజ్రం అని తేల్చారు. పెరవలి, జొన్నగిరికి చెందిన వ్యాపారులు కూడా దొరికిన రాయి వజ్రమే అని స్పష్టం చేశారు. వ్యాపారులు అంతా కలిసి మీడియేటర్ ద్వారా రైతును సంప్రదించి రహస్యంగా రూ.రెండు కోట్ల విలువైన వజ్రాన్ని రూ.35లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిసింది.
తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జీ ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పంట పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెప్తున్నారు. అదృష్టం రూపంలో విలువైన వజ్రం ఆ రైతు తలుపు తట్టడంతో రాత్రికి రాత్రే ఆయన ధనవంతుడై పోయాడు. అదృష్టం బాగుంటే ఏదో ఒక రీతిన మనల్ని వెతుక్కుంటూ వస్తుందని మన పెద్దలు చెప్పే మాటలు ఇలా అక్షర సత్యం అయ్యాయి.