Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం ( ఏ రోజు ముందు వస్తే ఆ రోజు) శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ ఏడాది ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు తెలిపారు.
అమ్మవారికి సాత్త్విక బలి నిర్వహించేందుకు ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. ఈ కుంభోత్సవంలో అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు తదితరాలు సమర్పిస్తారు. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం.
కుంభోత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియగానే ప్రతి మంగళవారం, శుక్రవారం నాడు అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవారికి కొబ్బరి కాయలు సమర్పించడం జరిగిందని ఈఓ పెద్దిరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు, కుంకుమలతో పూజాదికాలు జరిపించామన్నారు. ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించినట్లు తెలిపారు.