అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని ఎం రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రాసిక్యూషన్ నిర్వహణకు న్యాయవాది వై కోటేశ్వరరావు (వైకే) ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసిస్టెంట్ స్పెషల్ పీపీగా మరో న్యాయవాది మల్లికార్జునరావు కూడా నియమితులయ్యారు. గుంటూరులోని పోక్సో కేసుల విచారణ ఈ నెల 15న ప్రత్యేక కోర్టులో జరుగనున్నది.
ఈ కేసులో తమను ప్రత్యేక పీపీగా, ఏపీపీగా నియమిస్తూ ప్రభుత్వం జీవో 364 ద్వారా జారీ చేసిన ఉత్తర్వులు ప్రాసిక్యూషన్ విభాగం ద్వారా కోర్టుకు, న్యాయవాదులకు చేరడంలో జాప్యం జరుగుతున్నదని స్పెషల్ పీపీగా నియమితులైన వై కోటేశ్వరరావు చెప్పారు. గతేడాది ఏప్రిల్ 7న జారీ చేసిన ఉత్తర్వులను ఈ ఏడాది జూన్ 28న అందజేసినట్లు తెలిపారు. ఈలోగా ఈ కేసులో ప్రాసిక్యూషన్ సాక్షుల వాంగ్మూలాల రికార్డింగ్ పూర్తయిందని, నిందితుల తరఫున డిఫెన్స్ సాక్ష్యాధారాలు నమోదు చేసే దశకు చేరుకున్నదని పేర్కొన్నారు.
ఈ నెల 1న కోర్టు వాయిదాకు హాజరైన స్పెషల్ పీపీ వై కోటేశ్వరరావు, ఏపీపీ మల్లికార్జునరావులు ప్రాసిక్యూషన్ నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని మెజిస్ట్రేట్కు అందజేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన పురోగతి, సాక్షులు నమోదు చేసిన పత్రాలు, ఇతర అంశాలను అధ్యయనం చేసి చట్టబద్ధంగా ప్రాసిక్యూషన్ను నిర్వహించేందుకు అనుమతించాలని వారు కోర్టును అభ్యర్థించారు. నిందితుల తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణను కోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో ఏఎన్యూ బీఆర్కే కళాశాల ప్రిన్సిపాల్ బాబురావు, ముగ్గురు బీఆర్కే విద్యార్థులు నిందితులుగా ఉన్నారు.