తిరుమల : ఉగాది పండుగ సందర్భంగా తిరుమల(Tirumala )శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో(Ttd) ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.
ఈ సందర్భంగా ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేస్తారని వెల్లడించారు.సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారని వివరించారు.
బుధవారం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్నారు. మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, బుధవారం ఉగాది ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలను (break darsan )రద్దు చేసినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు మూరంశెట్టి రాములు, మారుతి ప్రసాద్, మధుసూదన్ యాదవ్, వీజీవో బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మార్చి 22న ఉగాది ఆస్థానం
శ్రీవారి ఆలయంలో ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారని వివరించారు. ఉదయం 7 నుంచి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని వివరించారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారని వెల్లడించారు. అనంతరం పంచాగ శ్రవణం(panchanga sravanam), ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు.