అమరావతి : కడపలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి(Kodanda Rama Swamy) వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో(Brahamotsavam) భాగంగా మూడో రోజు ఆదివారం శ్రీ కోదండ రాముడు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు (Devotees)అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
పురాణాల ప్రకారం.. జలప్రళయం సంభవించినపుడు శ్రీమహావిష్ణువు మర్రి ఆకుపై తేలియాడుతూ చిన్న శిశువుగా దర్శనమిస్తారు. కుడికాలి బొటనవేలిని నోటిలో పెట్టుకుని ఆస్వాదిస్తుంటారు. ఈ ఘట్టాన్ని గుర్తుచేస్తూ శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీరాముడు భక్తులకు కనువిందు చేశారు.
భక్తుల కష్టాలను కడతేర్చేందుకు ఎప్పుడూ ముందుంటానని స్వామివారు ఈ అలంకారం ద్వారా తెలియజేశారని వటపత్రశాయి మహిమను అన్నమయ్య తన సంకీర్తనల్లో వర్ణించారని అర్చకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, ఏఈవో గోపాలరావు, సూపరింటెండెంట్లు పి.వెంకటేశయ్య, ఆర్సీ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పె్క్టర్ ధనంజయ పాల్గొన్నారు.