అమరావతి : గుడివాడ క్యాసినో వ్యవహారంలో పూర్తిగా ఉన్న సాక్ష్యాదారాలు ఉన్నాయని ఏపీ టీడీపీ నాయకులు వెల్లడించారు. క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని మంత్రి కొడాలి నాని సవాలును స్వీకరిస్తూనే తాము అతడి ఆత్మహత్యను కోరుకోవడం లేదని జరిగిన సంఘటనపై మంత్రి పదవికి రాజీనామా చేయాలని నాయకులు బొండా ఉమ డిమాండ్ చేశారు. ఈరోజు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
క్యాసినోను నిర్వహించారని తమ వద్ద పూర్తి ఆదారాలు ఉన్నాయని వాటిని నిరూపించడానికి ఎక్కడికి రావాలో, ఎప్పుడు రావాలో చెప్పాలని ఆయన పేర్కొన్నారు. సాక్ష్యాలతో దొరికిపోయిన మంత్రి టీడీపీ నాయకులపై ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. కే కన్వెన్షన్లో నృత్యాలు ఆపించానంటూనే క్యాసినో జరగలేదంటూ మంత్రి కొడాలి నాని పొంతనలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పోలీసుల అనుమతి తీసుకుని గుడివాడ వెళితే తమకు బందోబస్తు కల్పించకుండా వైసీపీ గుండాలు దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నారని రాష్ట్ర పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని, వైసీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.