Kesineni Nani | టీడీపీ అధినేత చంద్రబాబుపై కేశినేని నాని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని విమర్శించారు. ఏపీకి ఉపయోగం లేని వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 60 శాతం టీడీపీ ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. టీడీపీ కోసం సొంత వ్యాపారాలు మూసేశానని, ఆస్తులు అమ్ముకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థిగా శ్వేతను చంద్రబాబే సూచించారని అన్నారు. ప్రెస్మీట్ పెట్టించి మరీ తనను తిట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేశ్కు ఏం అర్హత ఉందని పాదయాత్ర చేస్తున్నారని నిలదీశారు. తన కుటుంబసభ్యులతోనే కొట్టించాలని లోకేశ్ చూశారని.. తన కుటుంబంలో చిచ్చుపెట్టారని అన్నారు.
చంద్రబాబు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు
టీడీపీ పార్టీ కోసం చాలా కష్టపడ్డానని కేశినేని నాని అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టీని భుజస్కంధాలపై మోశానని తెలిపారు. సొంత వ్యాపారాల కంటే టీడీపీ గెలుపు ముఖ్యమని భావించానని తెలిపారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టానని అన్నారు. ఎందుకు డబ్బులు వృథా చేసుకుంటున్నావు? 2012-13 సమయంలో టీడీపీ గెలిచేది లేదని గతంలో చాలామంది హెచ్చరించారని గుర్తించారు. అయినప్పటికీ వాటన్నింటినీ పక్కనబెట్టి చంద్రబాబు కోసం ముందుకు సాగానని చెప్పారు. దాని ఫలితంగా కార్పొరేషన్, జడ్పీటీసీ, ఎంపీపీలు, పంచాయతీలు గెలిచామని అన్నారు. జనరల్ ఎలక్షన్లలో కూడా గెలిచామని గుర్తించారు. అప్పుడు కృష్ణా జిల్లా మొత్తం బాధ్యత తనే తీసుకున్నానని చెప్పారు. అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తనదేనని వెల్లడించారు. అన్నీ అయిపోయిన తర్వాత తనను పక్కనబెట్టారని.. అయితే ప్రజాగ్రహం తాళలేక మళ్లీ సీటు ఇచ్చారని గుర్తుచేశారు. ఏనాడు కూడా ఎంపీగా వేటికీ ఆశపడకుండా.. పార్టీ కోసం, ప్రాంతం కోసం.. ప్రజల కోసం కష్టపడ్డానని చెప్పారు. ఈ ప్రాసెస్లో ఆస్తులు అమ్ముకున్నా.. వ్యాపారాలు మానుకున్నా అని తెలిపారు. ఇవాళ తాను హైదరాబాద్లో అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లు అని వెల్లడించారు. ఇవి కాకుండా వ్యాపారాలు కూడా ఆపుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆరోజు కూడా బాధపడకుండా ముందుకెళ్లానని చెప్పారు. చంద్రబాబు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. ఆ తర్వాత అనేక రకాలుగా తనను అవమానపరచాలని చూశారని కేశినేని నాని అన్నారు.
ప్రెస్మీట్ పెట్టి మరీ తిట్టించారు
విజయవాడ మేయర్ అభ్యర్థిగా బోండా ఉమ భార్యను ప్రకటిస్తే ప్రమాదమని.. నీ ఫ్యామిలీలో ఎవరినైనా పెట్టమని చంద్రబాబు సూచించారని కేశినాని నాని అన్నారు. తన వాళ్లకు ఆ ఆలోచన లేదని చెబితే.. మూడు రోజులపాటు చంద్రబాబు బలవంతం చేశారని అన్నారు. ఆ తర్వాత శ్వేత నిలుచుందని తెలిపారు. కానీ ఎలక్షన్స్కు రెండు మూడు రోజుల ముందు ఓ వ్యక్తితో ప్రెస్మీట్ పెట్టి మరీ తిట్టించాడని అన్నారు. ఎంపీ కేశినేనిని చెప్పుతో కొడతానని ఓ క్యారెక్టర్ లెస్ పర్సన్ అన్నప్పటికీ.. పార్టీ నుంచి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ పార్టీ అధ్యక్షుడు.. పార్టీ ఎంపీకి ఫోన్ చేసి ప్రోటోకాల్కు విరుద్ధంగా నావెంట రావద్దని అన్నారు. అయినా కానీ భరించానని తెలిపారు. తిట్టినా.. అవమానించినా భరించానని తెలిపారు. ఇష్టం లేకపోతే వెళ్లిపోతానని చంద్రబాబుతో చెప్పా కానీ.. వద్దు నువ్వు ఉండాల్సిందేనని చంద్రబాబు చెప్పారని తెలిపారు.
నువ్వు ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యేవి.. లోకేశ్పై ఫైర్
నేను టీడీపీకి ద్రోహం చేశానా? ఏ తప్పు చేశానని ప్రశ్నించారు. తొమ్మిదేండ్లలో పార్టీ పట్ల, విజయవాడ పట్ల చేసిన తప్పు ఒక్కటి ఉంటే చూపించాడని అన్నారు. మీరు జైళ్లో ఉంటే అండగా నిలబడలేదా? అని ప్రశ్నించారు. ఏ అర్హత ఉందని లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు కాబట్టి ఓడినా.. గెలిచినా ఏదైనా చేస్తావా? ఈ రాష్ట్రం కోసం ఏం త్యాగం చేశావని ప్రశ్నించారు. ఓడిపోయిన ఎమ్మెల్యేవి నువ్వు.. యాంటీ వేవ్లోనూ గెలిచిన ఎంపీ వచ్చి నీ దగ్గర జీహుజూర్ అని అనాలా? అని నిలదీశారు. నీ పాదయాత్రలో ఏ ప్రోటోకాల్తో ప్రశ్నించాలి అన్నారు. నువ్వు ఆఫ్ట్రాల్ ఓడిపోయిన ఎమ్మెల్యేవి అని ఎద్దేవా చేశారు.
లోకేశ్.. తాత తండ్రి పేర్లు వాడుకున్నా గెలవలేదు
పార్టీ వనరులు, ఆస్తులతో పాటు తాత, తండ్రి పేర్లను వాడుకున్నావని.. అయినా ఎన్నికల్లో ఓడిపోయావని లోకేశ్పై ధ్వజమెత్తారు. నేను రెండుసార్లు ఎంపీగా గెలిచానని అన్నారు. టీడీపీని భుజాలపై పెట్టుకుని మోశానని కేశినేని నాని అన్నారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నా.. వ్యాపారాలు మానుకున్నానని తెలిపారు. పార్టీ కోసం నువ్వు ఏ త్యాగం చేశావని లోకేశ్ను నిలదీశారు. ఏ హక్కుతో యువగళం పాదయాత్ర చేశావని ప్రశ్నించారు. టీడీపీ కూటమికి 40 కంటే ఎక్కువ సీట్లు రావని కేశినేని నాని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు పచ్చి మోసగాడు
చంద్రబాబు పచ్చి మోసగాడు అని కేశినేని నాని ఆరోపించారు. ఈ రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి అతను అని అన్నారు. జనం దేవుడు అనుకుంటారా? కులపరంగా అనుకుంటారా? మీడియాపరంగా అనుకుంటారా? ఇంకా ఎందుకు అనుకుంటారా? అని తెలియదు గానీ.. జగన్ మాత్రం పేదల పక్షపాతి అని అన్నారు. ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశానని.. రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరతానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనలకు 40 సీట్ల కంటే ఎక్కువ రావని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 80 శాతం ఖాళీ అవబోతుందని స్పష్టం చేశారు.