అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రాలో కేసీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి దూసర్లపూడి రమణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు 1999 లోనే కాకినాడ కేంద్రంగా తీర్మానం చేసి.. అటు తెలంగాణలో ఇటు ఏపీలో విశృంఖల రాజకీయం నడిపిందని విమర్శించారు. ఇప్పుడు కేసీఆర్కు మాత్రం బీఆర్ఎస్ పేరిట ఆంధ్రాలో అడుగుపెట్టే హక్కులేదని వీర్రాజు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇంట గెలిచి, రచ్చ గెలువాలన్న రీతిగా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు భారత రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారని రమణరాజు చెప్పారు. తెలంగాణలో జరిగినంత అభివృద్ధి దేశవ్యాప్తంగా ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా జరుగలేదన్నారు. ఆంధ్రాలోనేగాక 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా కేసీఆర్కు అభిమానులు ఉన్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు నిర్మాణాత్మక పాత్ర ఇస్తారని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రులను తిట్టారంటూ కేసీఆర్పై వ్యాఖ్యలు చేయడం అవివేకమన్నారు రమణరాజు. దుష్ట రాజకీయశక్తులను సమర్థంగా ఎదుర్కొని ఎండగట్టడంవల్లే తెలంగాణ రాష్ట్రం ప్రగతి సాధించిందన్నారు. ఇప్పుడు అవే దుష్ట శక్తుల కారణంగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు తగవని, ఆయన అభిమానులుగా మేం గట్టిగా ఎదుర్కొంటామని రమణరాజు హెచ్చరించారు.