Vizag Steel Plant | విశాఖ స్టీల్ను కాపాడేందుకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కృషి చేశారని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్రమంత్రి ఫగ్గస్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ను కాపాడేందుకు కేసీఆర్ చాలా కృషి చేశారని, ఆంధ్రా పార్టీలు మాత్రం పోరాడలేదని విమర్శించారు. కేసీఆర్ మొదటి నుంచి ప్రైవేటీకరణపై పోరాడుతున్నారన్నారు. స్టీల్ ప్టాంట్ను అమ్మితే అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కొంటామని చెప్పారని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థలపైన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే.. మేం జాతీయీకరణ చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ, టీడీపీ సహా ఇతర పార్టీలు ప్రజలను పట్టించుకోవడం లేదు. తెలుగు ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అనే విశ్వాసం ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు, ఉద్యోగులకు తాము అండగా ఉన్నామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముందుకెళ్లామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విలువ దాదాపు రూ.3లక్షల కోట్లని చెప్పారు. ప్లాంట్ కోసం 32 మంది కార్మికులు మరణించారని గుర్తు చేశారు.
ప్రైవేటీకరణ పేరుతో 35వేల కుటుంబాలను రోడ్డున పడేసేందుకు కేద్రం కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. జాతి సంపదను కాపాడేందుకు సీఎం కేసీఆర్ చాలా కృషి చేస్తున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై వెంటనే కేంద్రం పెట్టుబడి సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గనుల కేటాయింపు విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ఆర్ఐఎన్ఎల్కు కేటాయించడం ద్వారా స్వయం సమృద్ధి సంస్థగా దీన్ని మలచాలని సూచించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేలా స్పష్టమైన విధానాన్ని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈఓఐ తక్షణం రద్దు చేయాలన్నారు.