Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం సందడి సందడిగా మారింది. కార్తీక మాస శోభను సంతరించుకున్న శ్రీశైల మహాక్షేత్రం శివ నామస్మరణతో మార్మోగుతుంది. కార్తీకమాసం ఆఖరి వారం కావడంతోపాటు వారాంతపు సెలవులు కలిసిరావడంతో భక్తులు కుటుంబ సమేతంగా క్షేత్రానికి చేరుకుంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గంగాధర మండపం, ఉత్తర మాడవీధి వద్ద దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం భక్తులకు స్వామిఅమ్మవార్ల ఉచిత దర్శనానికి 4 గంటలు, శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం, అతి శీఘ్ర దర్శనానికి గంట సమయం పడుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దర్శనానంతరం బయటకు వచ్చే భక్తులకు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో కూడా ప్రసాద వితరణ చేస్తున్నారు.
శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే యాత్రికుల సంఖ్య పెరుగుతున్నందున రద్దీ రోజులలో స్వామి వారి గర్భాలయ అభిషేకాలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. అలాగే అమ్మవారి అంతరాలయంలో జరిపించే కుంకుమార్చనలు కూడా ప్రాకార మండపంలోనే నిర్వహించనున్నట్లు చెప్పారు.
మృత్యుంజయ హోమం, రుద్రహోమం, చండీ హోమాలకు నిర్ణీత టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నప్పుడు మంచినీరు, పాలు, బిస్కెట్లు,
అల్పాహారాలు అందించడంతోపాటు నిరంతర అన్నదాన కార్యక్రమాలు జరుపుతున్నట్లు చెప్పారు. అలాగే కార్తీక మాసాంతం రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు అవసరమైన లడ్డూ ప్రసాదాలను 10 కౌంటర్ల ద్వారా అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే యాత్రికులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవోపెద్దిరాజు కోరారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీశైలంలో టాఫిక్ ఆంక్షలు కఠినతరం చేశారు. భక్తులు టోల్ గేట్ నుండి వలయ రహదారి గుండా నిర్ణీత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా సూచించారు. క్షేత్ర పుర వీదుల్లోకి ప్రవేశించి అడ్డగోలుగా పార్కింగులు చేసి యాత్రికులకు ఇబ్బందులు కలిగించకుండా ఉండేలా పలు కూడళ్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను నియంత్రిస్తున్నట్లు శ్రీశైలం సిఐ దివాకర్ రెడ్డి తెలిపారు