Srisailam | అక్టోబర్ 26 నుంచి నవంబర్ 23 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలకు వచ్చే భక్తుల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నది. శనివారం క్యూ కాంప్లెక్స్ వద్ద ఏర్పాట్లపై ఈవో లవన్న సమీక్షించారు. ప్రస్తుతం క్యూ కాంప్లెక్స్లో ఉన్న కుర్చీల స్థానంలో స్టీల్ కుర్చీలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అవసరమైన మేరకు మ్యాట్లు కూడా మార్చివేయాలని అన్నారు. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలో అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని చెప్పారు.
ముఖ్యంగా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈవో లవన్న సిబ్బందిని ఆదేశించారు. క్యూ కాంప్లెక్స్లోని అన్ని శౌచాలయాల్లో శుభ్రత నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. క్యూ కాంప్లెక్స్లోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు నిరంతరం ఉపయోగానికి అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ కాంప్లెక్స్ పరిధిలో మరిన్ని సూచన బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్, శ్రీశైల ప్రభ విభాగాలను లవన్న ఆదేశించారు. కార్తీక మాసోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వీ రామకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డి, ఆలయ సహాయ ఈవో హరిదాసు, పీఆర్వో టీ శ్రీనివాసరావు, పర్యవేక్షకులు ఎం రవి కుమార్, సీఎస్వో నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.