Karthika Masotsavam in Srisailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునులకు ప్రత్యేక పూజలు చేసుకుని కార్తీక దీపాలు వెలిగించేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుండటంతో శనివారం క్షేత్ర పరిధిలో సందడి నెలకొంది. వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఉభయ తెలుగు రాష్ర్టాల యాత్రికులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులతో శ్రీగిరి పురవీధులు కిటకిటలాడాయి.
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈవో లవన్న తెలిపారు. రద్దీకి అనుగుణంగా గర్బాలయ స్పర్శ దర్శనాలు నిలిపివేయగా, సామూహిక అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలు జరుగుతున్నట్లు తెలిపారు. స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల్లో కేవలం అలంకార దర్శనం మాత్రమే ఉన్నందున దర్శనానికి గంట సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
కార్తీక మాస శుద్ధ చవితి సందర్భంగా శనివారం నాగుల చవితి ప్రత్యేక పూజలు జరిపించినట్లు ఈవో లవన్న పేర్కొన్నారు. కాగా, శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను న్యూఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ సుబ్రమణ్య ప్రసాద్ దర్శించుకున్నారు.
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు తమ వాహనాలలో ఎటువంటి మత్తు పదార్థాలను తీసుకురావద్దని ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి హెచ్చరించారు. టోల్ గేట్ వద్ద ప్రతినిత్యం వాహన తనిఖీలు జరుగుతూనే ఉంటాయని తెలిపారు. దేవస్థాన నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని వాహనాలను సీజ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.