Srisailam | ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభయ్యాయి. కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా మంళవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. యాత్రికులకు అవసరమయ్యే పూర్తి ఏర్పాట్లు చేసుకుని సర్వం సిద్దంగా ఉన్నామని దేవస్థానం అధికారులు తెలిపారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికీ శివయ్య దర్శనం కలిగేలా చర్యలు చేపట్టారు. మాసాంతం గర్బాలయ, వారాంతపు రోజుల్లో స్పర్శ దర్శనాలు పూర్తిగా నిలిపివేసి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు. కనుక స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో పెద్దిరాజు కోరారు. కార్తీక మాసాంతం ప్రతిరోజు సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభంపై వెలిగించే ఆకాశదీప ప్రజ్వలన కార్యక్రమం సాయంత్రం శాస్త్రోక్తంగా ప్రారంభించారు.
మంగళవారం నుండి వచ్చే నెల 12 వరకు జరిగే కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆలయ దర్శన వేళలతోపాటు శని, ఆది, సోమ వారాలు, పౌర్ణమి, ఏకాదశి, ప్రభుత్వ సెలవులతో కలిపి 13 రోజుల పాటు భక్తుల రద్దీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామి అమ్మవార్ల దర్శన విధానాల్లో పలు మార్పులు చేస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. శ్రీశైల మహా క్షేత్రానికి వచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్ల టైం స్లాట్స్ ప్రకారం మాత్రమే స్వామి అమ్మవార్ల దర్శనం ఉంటుందని, రుద్రహొమం, చండీ హోమాలు రెండు విడతలు, నిత్యకళ్యాణాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అల్పాహార భోజన ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసినట్లు ఈవో పెద్దిరాజు చెప్పారు. కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర మాడవీధిలో చేసిన ప్రత్యేక ఏర్పాట్లను భక్తులు వినియోగించుకోవాలని కోరారు. చతుస్సప్తాహ భజనలతోపాటు ప్రతి సోమవారం, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద పుణ్య నదీ హారతి లక్ష దీపార్చన వైభవంగా జరిపిస్తామని చెప్పారు. ఆలయ పరిధిలోని కీలక ప్రాంతాల్లో పర్యటించిన ఈఓ అధికారులకు సిబ్బందికి సూచనలు చేశారు.
పౌర్ణమి ఘడియలు ప్రారంభమైన రోజునే కృష్ణవేణి నదీమతల్లికి గంగా హరతి నిర్వహిస్తామని ఈవో పెద్దిరాజు తెలిపారు. అటుపై అనంతరం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమం ఉంటుందన్నారు. ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులు ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో కోరారు.