ప్రకాశం జిల్లా : ప్రజల కోరినందునే వైసీపీలో చేరానని, వారి కోరిక మేరకు చీరాల నుంచి అసెంబ్లీ బరిలో ఉంటానని కరణం వెంకటేశ్ వెల్లడించారు. పార్టీ అధినేత జగన్ ఏం చెప్తే అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనకు ఎక్కడ టిక్కెట్ ఇస్తారన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని బాపట్లలో జరిపిన మీడియా సమావేశంలో కరణం వెంకటేశ్ తెలిపారు. చీరాల నుంచి టీడీపీ టికెట్పై గెలిచిన కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీ మద్దతుదారుగా నిలిచారు. ఆయన ఏకైక కుమారుడు వెంకటేశ్ మాత్రం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల స్థానం నుంచి పోటీ చేయాలని తాను అనుకుంటున్నట్లు కరణం వెంకటేష్ చెప్పారు. వైసీపీ టికెట్ మీదనే చీరాల నుంచి పోటీ చేస్తానన్నారు. ప్రజలు తన పట్ల చూపిస్తున్న స్పందనను బట్టి చీరాల నుంచే పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే ఏ స్థానం నుంచి టికెట్ కెటాయిస్తారన్నది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని, వారి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తానని వెంకటేష్ తెలిపారు.
గత మూడేండ్ల కాలంలో చీరాల నియోజకవర్గంలో దాదాపు రూ.1.65 కోట్ల నిధులతో వివిధ పథకాల కింద లబ్దిదారులకు అందజేసినట్లు వెంకటేశ్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారనడానికి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు వెంకటేశ్ పేర్కొన్నారు. అధికార వికేంద్రీకరణ చేపట్టడం ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా వృద్ధిలోకి వస్తాయని అభిప్రాయపడ్డారు.