Pithapuram | ఎట్టకేలకు వైసీపీ అపరేషన్ ముద్రగడ ఫలించింది. భేషరతుగా వైసీపీలో చేరేందుకు ముద్రగడ ఫ్యామిలీ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఎలాంటి టికెట్ ఆశించకుండానే ఆయన పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.
పవన్ కళ్యాణ్తో కలిసి నడవాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం ముందు నుంచి అనుకున్నారు. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం.. సీట్ల పంపకంలోనూ రాజీ పడటం ముద్రగడకు నచ్చలేదు. పవర్ షేరింగ్ అడగకుండా 24 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావడాన్ని ఇటీవల ఆయన బహిరంగంగా కూడా విమర్శించారు. ఇది కాకుండా మొదట్నుంచి కూడా ముద్రగడకు పవన్ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదు. ముద్రగడను ప్రత్యేకంగా కలుస్తానని పలుమార్లు హామీ ఇచ్చిన పవన్ మాట తప్పారు. ఈ తీరు పవన్పై ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ మాటల తర్వాత ముద్రగడ మనసు మారినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తన ఇంటికి వస్తారని.. మాట్లాడతారని ఆశించిన ముద్రగడకు ఆ పరిణామాలు కనిపించలేవు. దీన్ని ముద్రగడ వర్గం ఆయనకు జరిగిన అవమానంగా భావించాయి. జనసేనతో ముద్రగడకు చెడిందని తెలియడంతో వైసీపీ నేతలు రంగంలోకి దిగారు. ఆపరేషన్ ముద్రగడ పేరుతో ఆయన్ను వైసీపీ పార్టీ వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అందులో సఫలమయ్యింది.
కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలని వైసీపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ అయితేనే పవన్పై బలమైన అభ్యర్థి అవుతారని అనుకుంటున్నది. అయితే ఇప్పటికే పిఠాపురం వైసీపీ ఇన్చార్జిగా వంగా గీతను వైఎస్ జగన్ నియమించారు. ఈ క్రమంలో వంగా గీతను సీఎంవోకు పిలిపించుకుని సీఎం జగన్ చర్చలు జరిపారు. పిఠాపురం టార్గెట్గా గైడెన్స్ ఇచ్చారు.