తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కల్యాణమస్తును తిరిగి ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి కల్యాణమస్తును రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది. ఈ విషయాలను ఆలయ ఈఓ ఏవీ ధర్మారెడ్డి మీడియాకు వెల్లడించారు. శ్రీవారి ఆశీస్సులతో ఆగస్టు 7న ఉదయం 8.07 నుంచి 8. 17 గంటల మధ్య 26 జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. తిరుపతి శ్వేత భవనంలో కల్యాణమస్తు కేంద్రీకృత కార్యాలయాన్ని బుధవారం ఈఓ ప్రారంభించి, కల్యాణమస్తు దరఖాస్తు పత్రం, కరపత్రాలను ఆవిష్కరించారు.
టీటీడీ నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవంలో ఒకటయ్యే వధూవరులకు రెండు గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండి మెట్టెలు, పెండ్లి వస్త్రాలు, వధువు నుంచి 20 మంది, వరుడి నుంచి 20 మందికి ఉచితంగా భోజన సదుపాయం కల్పించనున్నట్లు ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. వివాహం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నదని, అయితే, స్వామివారి ఆశీస్సులతో పేదలకు ఉచితంగా జరిపించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జూలై 1 నుంచి 20వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కల్యాణమస్తు రిజిస్ట్రేషన్ కొనసాగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కోసం కల్యాణమస్తు దరఖాస్తు పత్రాలను అన్ని జిల్లా కేంద్రాలకు పంపుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు టీటీడీ నుంచి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక కో అర్డినేటర్ను నియమించి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలతో సమన్వయం చేయనున్నట్లు ధర్మారెడ్డి వివరించారు.
జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్ఓ నరసింహ కిషోర్, డిప్యూటీ ఈఓలు శ్రీమతి విజయలక్ష్మి, గోవిందరాజన్, శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి, తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.