శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలోని రాజగోపురం వద్ద బంగారు శిఖరాని(కలశం)కి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. యోగ మండపంపై నెలకొల్పేందుకు దాతల సహకారంతో శిఖరాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల ప్రదేశంలోని రాత్రితో కొత్త యాగశాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన బట్టా పర్వతయ్య, శరదాదేవి ఆర్థిక సహకారం అందించారు. అంతకు ముందు సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో కలశాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి, పూజలు చేశారు. అలాగే యాగశాలపై ఏర్పాటు చేయనున్న సింహ శిల్పాలకు సైతం పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు యాగశాల ఉపపీఠం, పీఠంపై స్తంభాలు ఏర్పాటు పనులు జరిగాయి. ప్రస్తుతం పైకప్పు పనులు కొనసాగుతున్నాయి. ఆయా స్తంభాలపై అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గల మూర్తుల రూపాలను మలిచారు.