హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ (పీఎస్పీ) వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ తన చిత్ర విచిత్ర ప్రకటనలు, చేష్టలతో ప్రజల్ని ఆకట్టుకుంటారు. అయితే, ఆయనను ప్రజప్రతినిధిగా ఎన్నుకొని అసెంబ్లీకి పంపేందుకు ఓటర్లు సుమఖత చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా వినిపిస్తున్న పొత్తుల దుమారంలో కేఏ పాల్ కూడా చేరారు. తన పార్టీని వీడి తనతో చేరాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్కు ఆఫర్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. పవన్ కల్యాణ్ను ప్రజాప్రతినిధిగా గెలిపించుకుంటాం.. లేదంటే వెయ్యి కోట్ల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు.
మత ప్రచారకుడి పోస్టు నుంచి రాజకీయ నాయకుడుగా మారిన కేఏ పాల్.. ఓ వార్తా చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ను తన ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తన పీఎస్పీలో ఏ పదవి కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.
పవన్ కల్యాణ్ను ఎంపీగానో, ఎమ్మెల్యేగానో గెలిపించేలా చూస్తామని, అంతేకాకుండా ఆయనను గెలిపించుకోలేని పక్షంలో రూ.1,000 కోట్ల పరిహారం ఇస్తానని కూడా ప్రతిపాదన తీసుకొచ్చాడు. పలు రాజకీయ పార్టీలతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడంపై పాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినా గెలవలేరని జోస్యం చెప్పారు. పవన్ తన ప్రసంగంలో బైబిల్ను ఉటంకిస్తూ ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడడం సరదాగా ఉన్నదన్నారు.
వచ్చే ఎన్నికల కోసం ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడంలేదని కేఏ పాల్ స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలం చెందారని విమర్శించారు. చంద్రబాబు తన ఆస్తులను కాపాడుకునేందుకే తన కుమారుడు లోకేష్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని కేఏ పాల్ ఆరోపించారు.