ఢిల్లీ: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం చేయరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే కొన్ని వర్గాలకు చెందిన అభిమానులను కోల్పోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా కెరీర్లో ఎత్తుకు ఎదుగుతున్న సమయంలో తన ఇమేజ్ను ఆయన పణంగా పెడతాడని తాను అనుకోవడం లేదని చెప్పారు. అయితే, భవిష్యత్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలో చేరతారని పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ను బీజేపీ ఉపయోగించుకుంటుందని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ప్రస్తావించడంపై రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని చెప్పారు. బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్కల్యాణ్కు సత్సంబంధాలు ఉన్న విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఇమేజీని వాడుకునేందుకు సోము వీర్రాజు పడరాని పాట్లు పడుతున్నారని వ్యంగ్యంగా చెప్పారు. ఎంతో భవిష్యత్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడే రాజకీయాల్లోకి ఎలా వస్తారని సోము వీర్రాజు ఊహిస్తున్నారని ప్రశ్నించారు.
విజయవాడలో చెన్నుపాటి గాంధీపై దాడిని ఖండించిన రఘురామ.. తనపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్తేందుకు ప్రయత్నించగా రైలు భోగిని దగ్ధం చేసి తనను చంపాలని ప్లాన్ వేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, ప్రజలు ఓపికగా భరిస్తున్నారన్నారు. కుప్పం, తెనాలి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ధ్వంసం చేశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతిని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతానని చెప్పారు. అలాగే, రుషికొండను ఆక్రమించుకున్నారని, రుషికొండపై ప్రకృతి విధ్వంసాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.