తిరుపతి : టీటీడీ బోర్డు తిరుపతిలో నిర్మిస్తున్న చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విలువైన విజ్ఞానం దాగి ఉన్న మాను స్క్రిప్ట్స్ను (చేతి రాతల ప్రతులు) చక్కగా స్కాన్ చేసి భావితరాలకు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. తాడేపల్లిలోని తన కార్యాలయం నుంచి శనివారం ఆయన టీటీడీలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ, స్విమ్స్ లో క్యాన్సర్ యూనిట్ లోని ఈ, ఎఫ్ బ్లాక్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, అవసరమైన పరికరాల కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలన్నారు. బర్డ్ ఆస్పత్రి సమాచారం, ఓపీ ఇతర వివరాలన్నింటితో కలిపి మొబైల్ యాప్ తయారు చేయాలని సూచించారు. బర్డ్లో కొత్తగా 100 పడకలు అందుబాటులోకి తేవడానికి తగిన ఏర్పాటు చేయాలన్నారు. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో ఈ నెలాఖరులోపు నూతన యంత్రాలను పూర్తిగా ఏర్పాటు చేసి అక్టోబర్ నుంచి 266 రకాల కొత్త మందుల తయారీకి తగు అనుమతులతో చర్యలు తీసుకోవాలని జవహర్రెడ్డి చెప్పారు.
తిరుమలలో మ్యూజియంను అభివృద్ధి, అంజనాద్రి, వెంగమాంబ ధ్యాన మందిరం, ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ-ఎం బుక్ అంశాలపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. అలాగే తిరుమలలో విద్యుత్ పొదుపునకు మీటర్ల ఏర్పాటు తదితర అంశాలను అధికారులు అడిగి తెల్సుకున్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆధునీకరణలో భాగంగా వర్క్ స్టేషన్స్, ప్రధాన ద్వారం ఎలివేషన్ అత్యద్భుతంగా వచ్చేలా వైకుంఠ ఏకాదశి నాటికి పనులు పూర్తి చేయాలన్నారు. జమ్ము, చెన్నైలో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణ పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. గో శాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంటు, నెయ్యి తయారీ ప్లాంట్, గోశాల నిర్వహణ, దేశీయ గో జాతుల పిండోత్పత్తి విషయాలపై సమీక్షించారు.
టీటీడీ విద్యాలయాలకు సంబంధించి న్యాక్ గుర్తింపు, విద్యార్థుల వివరాలతో అప్లికేషన్ రూపొందించాలని జవహర్రెడ్డి చెప్పారు. తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో అకేషియా చెట్ల తొలగింపునకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. వేదాల సారాన్ని ప్రజలకు అందించేలా ఎస్వీబీసీ కార్యక్రమాలు రూపొందించాలన్నారు. అలిపిరిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన నియమావళిని సిద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జేఈఓలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ఏసీఏఓ బాలాజి, ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ కుమార్, సీఏఓ శేష శైలేంద్రతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.