విజయవాడ: అధికార వైసీపీ ఎమ్మెల్యేను అడ్డుకునేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో హనుమాన్ జంక్షన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పోలీసులు-జనసేన కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నది. జనసేనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తూ వంశీ వాహనాలను అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
కొన్నాళ్లుగా వైసీసీ-జనసేన మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. దీనికి తోడు వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం తోడైనట్లయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను ఓడించేందుకు జనసేన డబ్బులు పంచిందని వంశీ ఆరోపించారు. ఈ ఆరోపణలను వంశీ రుజువు చేయాలంటూ అప్పటి నుంచి జనసేన డిమాండ్ చేస్తూ వస్తున్నది. అయితే, జనసేన డిమాండ్ను వంశీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
దాంతో కోపోద్రిక్తులైన జనసేన కార్యకర్తలు గురువారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లో వంశీ వాహనాన్ని అడ్డగించేందుకు తీవ్రంగా యత్నించారు. విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు పెద్ద ఎత్తున హనుమాన్ జంక్షన్కు చేరుకుని జనసేన ప్రయత్నాలను అడ్డుకున్నారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. జనసేన నేతలు డబ్బులు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలను వంశీ రుజువు చేయాలని, లేదంటే ఇలాగే అడుగడుగునా అడ్డుకుంటామని జనసేన నేత చలమలశెట్టి రమేశ్ హెచ్చరించారు.