Janasena | సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఏపీలో జనసేన పార్టీకి కొత్త తలనొప్పి మొదలయ్యింది. ఇప్పటివరకు గాజు గ్లాసును తమ పార్టీ సింబల్గా జనసేన ప్రకటించుకుంది. దానిపైనే పార్టీ ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఊహించని షాక్ ఇచ్చింది. గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చింది. అంటే రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడి నుంచైనా.. ఎవరైనా సరే ఈ గుర్తుపై పోటీ చేసేందుకు వీలు ఉంటుంది. దీంతో జనసేనలో కొత్త టెన్షన్ మొదలయ్యింది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ఇటీవల ఈసీ ప్రకటించింది. ఇందులో ఏపీ నుంచి టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలను గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. జనసేనను రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఈసీ ప్రకటించింది. జనసేన గుర్తుగా ప్రచారం చేసుకున్న గాజు గ్లాస్ను ఫ్రీ సింబల్ జాబితాలో ఉంచింది. దీంతో జనసేన గతంలో ఈసీ కేటాయించిన గాజు గ్లాస్ గుర్తు పోయినట్టయ్యింది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై న్యాయ నిపుణులతో చర్చలు జరిపి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నారు.