Pawan Kalyan | అనకాపల్లి అంటే అందరికీ బెల్లం గుర్తుకొస్తుంది.. కానీ ఇప్పుడు అనకాపల్లి పేరు వింటే కోడిగుడ్డు పేరు వినబడుతుందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఉద్దేశించి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. కోడి గుడ్డు పెట్టింది.. ఇంకా పొదుగుతూనే ఉంది.. వైసీపీ కోడి.. ఒక డిప్యూటీ సీఎంను, ఐదు పోర్ట్ఫోలియోలకు మంత్రిని, ఒక విప్ను ఇచ్చింది.. కానీ ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేకపోయిందని సెటైర్లు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
జగన్ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు అని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తన ఒక్కడి ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. తాను మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేదని.. కాకపోతే తనకు పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని స్పష్టం చేశారు. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్దకాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదు.. అయినా సరే, మీ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్షతోనే పనిచేస్తున్నా అని చెప్పారు.
ఇవాళ తాను ఎక్కడికి వెళ్లినా అశేష ప్రజాభిమానం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఇంతటి ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలన్న స్వార్థం ఉంటుంది కానీ.. దాన్ని దాటి జనం కోసం వచ్చానని చెప్పారు. కూటమి ప్రభుత్వం రావాలంటే ఒక్క తప్పు కూడా జరగకూడదని.. అన్ని శక్తులు ఏకం కావాలని అన్నారు. అందుకే 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్నామని వివరించారు. అనకాపల్లి ఎంపీ సీటు జనసేనదే అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు.