Pawan Kalyan | ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. పిఠాపురం చేబ్రోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదని తెలిపారు. తనను ఓడించేందుకు ఏపీ సీఎం జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి మండలానికో నాయకుడిని పెడుతున్నారని చెప్పారు. పిఠాపురం ప్రజలను అర్థిస్తున్నా.. నన్ను గెలిపించండి అని రిక్వెస్ట్ చేశారు. ప్రజల కోసం నిలబడతానని.. తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ అంటే జవాబుదారీతనం అని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. తాను మాట ఇచ్చానంటే ప్రాణం పోయినా వెనక్కితీసుకోనని తెలిపారు. తనకు సినిమాలపై, రాజకీయాలపై ఆసక్తి లేదని తెలిపారు. దశాబ్దం నుంచి ఒంటరి యుద్ధం చేస్తున్నానని అన్నారు. ఫ్యాన్కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ అని సెటైర్ వేశారు. ఏపీలో నాణ్యత లేని మద్యం విక్రయించడం వల్లే చాలామంది చనిపోయారని ఆయన ఆరోపించారు. మద్యం విక్రయాల్లో డిజిటల్ పేమెంట్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మద్యంపై వచ్చే ఆదాయంలో కొంత మొత్తమే ప్రభుత్వానికి వెళ్తోందని.. మిగిలినదంతా జగన్, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని అన్నారు. వైసీపీ కావాలా.. కూటమి కావాలా నిర్ణయించుకోండని చెప్పారు. పిఠాపురానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తెస్తానని హామీ ఇచ్చారు.