Pawan Kalyan | రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా అర్థమవుతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను ఎంతగా దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తానని తెలిపారు. తనను ఎంతగా దూషించినప్పటికీ వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి.. కాపులనే వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకొచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసిందని విమర్శించారు. కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తుందని అన్నారు. కుట్రలు.. కుయుక్తలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలను కోరారు. ఈ మేరకు కాపు పెద్దలకు సంచలన లేఖ రాశారు.