Pawan Kalyan | నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలో జనసేన పార్టీ మండల, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.150 మందితో పదేండ్ల క్రితం పార్టీని ప్రారంభించామని.. ఇప్పుడు 140 నియోజకవర్గాల్లోని మండలాలకు ఇప్పుడు అధ్యక్షులు ఉన్నారు.. మిగిలిన 35 నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే నియమిస్తామని తెలిపారు. తాను నాయకత్వపు బాధ్యలు వహిస్తున్న కార్యకర్తను మాత్రమేనని స్పష్టం చేశారు. తాను మార్పును, పరివర్తనను కోరుకునే వ్యక్తినని పవన్ కల్యాణ్ అన్నారు. డబ్బు లేకుండా రాజకీయం చేయవచ్చని నిరూమించామని తెలిపారు. ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలనే చెప్పానని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్పై కూడా పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
1980వ దశకంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు ఇన్ని పార్టీలు లేవని గుర్తుచేశారు. నాదేండ్ల భాస్కరరావు, ఉపేంద్ర, ఎన్జీరంగా వంటి పెద్ద పెద్ద నాయకుల సలహాలు సూచనలతో ఆ పార్టీ స్థాపించారన్నారు. అప్పుడు ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. అలాగే అప్పటి రాజకీయాల్లో ఇంత డబ్బు, పగ, ప్రతీకారాలు లేవని పేర్కొన్నారు. వాళ్లొచ్చిన కాలం వేరు.. వాళ్లు ఉన్న పరిస్థితులు వేరని అన్నారు. ఒక వ్యక్తికి పాపులారిటీ ఉన్నంత మాత్రాన రాత్రికి రాత్రి అధికారం వస్తుందనుకోవడం ఒక కల మాత్రమేనని అన్నారు. అది ఎన్టీఆర్కు సాధ్యమైందేమో కానీ తనకు అవుతుందని కలలో కూడా అనుకోలేదని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తా.. తప్ప తాను బాగుండాలంటే ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచించనని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ బాగుంటే పవన్ కల్యాణ్ బాగుంటాడు.. ఏపీ బాగుంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఆలోచించాలి అని అన్నారు. నినాదాలతో సీఎం అవ్వలేరని.. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని చెప్పారు. రోడ్ల మీదకొచ్చి గజమాలలు వేస్తే సీఎం అవ్వం.. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని స్పష్టం చేశారు. హారతులు పెడితే సీఎం అవ్వము.. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లిన విపరీతమైన ఆరాధన, ప్రేమ చూపిస్తుంటారు.. ఆ ప్రేమ, ఆరాధన ఓట్ల కింద మారనప్పుడు ఎంత ప్రజాదరణ ఉన్న నిష్ప్రయోజనమే అన్నారు. అది టీవీలు, టీఆర్పీలకు బాగుంటుంది తప్ప అధికారం దిశగా వెళ్లమని చెప్పారు. అజాత శత్రువు అవ్వడానికి రాజకీయాల్లోకి రాలేదని పునరుద్ఘాటించారు. తనకు భయాలు లేవని తెలిపారు.
2019 ఎన్నికల్లో 134 స్థానాల్లో పోటీ చేసినప్పుడు కనీసం 45-50 స్థానాల్లో మన ఎమ్మెల్యేలు ఉండి ఉంటే ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండేదని పవన్ కల్యాణ్ అన్నారు. అప్పుడు ఓట్లు వేయకుండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఎంఐఎం హైదరాబాద్లో 7 నియోజకవర్గాల వరకే పరిమితమైన పార్టీ అది.. ఏడు ఎమ్మెల్యేలు, ఒక పార్లమెంట్ స్థానంతో దేశమంతా దానికి ఇంపార్టెన్స్ అలాగే ఉందన్నారు. ఇంత జనాదారణ ఉండి పట్టుమని 10 స్థానాలు కూడా రాకుంటే ఏం చేస్తామని ప్రశ్నించారు.
కష్టాలు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ గుర్తొస్తాడు కానీ.. ఓట్లు వేసేటప్పటికి నమ్మకం పోతుందని పవన్ కల్యాణ్ న్నారు. ప్రజలకు మోసం చేసేవాళ్లే కావాలేమోని వాపోయారు. మాయమాటలు చెప్పి వంచించే వాళ్లనే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. సర్వస్వం వదిలి ప్రజల కోసం నిలబడితే నన్ను వదిలేశారని బాధ లేదు.. కానీ ఏ ప్రజలను అనుకుని వదిలేశానో.. వాళ్ల గుండెల్లో స్థానం సంపాదిస్తాం.. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు.
అనుకూల పవనాలు వీస్తున్నప్పుడు ప్రతి ఒక్కడూ గొప్పవాడే.. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు ప్రతి ఒక్కడూ కాలర్ ఎగరేస్తాడు.. కానీ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు నిలదొక్కుకున్న వాడే నాయకుడని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు దేశం నాయకులను ముఖ్యమంత్రిని చేసేందుకే జనసేన లేదని స్పష్టం చేశారు. మనం కలల్లో ఉండొద్దు అని జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ సూచించారు. పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలి.. జనసేన ప్రభుత్వం ఏర్పడాలనేది బలమైన కల.. ఆ కల కనండి అని తెలిపారు. కానీ దానికి వాస్తవంలో పునాదులు వేయండని.. గాల్లో మేడలు వేయొద్దని సూచించారు.