Pawan Kalyan | ఏపీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. కలిసొచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటానని స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనేందుకే బలం ఉన్న పార్టీలతో కలిసి నడవాలని భావిస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిస్ట్ పార్టీలను గౌరవిస్తానని.. కానీ ఎన్నికల్లో ప్రభావం చూపించే పార్టీలను దృష్టిలో ఉంచుకునే పొత్తులపై మాట్లాడనని వెల్లడించారు.
పొత్తులు అనేవి కులానికి సంబంధించినవి కావని.. రాష్ట్రానికి సంబంధించినవి అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తుల గురించి మాట్లాడానని స్పష్టం చేశారు. తమ గౌరవానికి భంగం కలగకుండా పొత్తుల విషయంలో ముందుకెళ్తామని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే తమ బలం డబుల్ అయ్యిందని వెల్లడించారు. 2019లో జనసేన పార్టీ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిందన్న పవన్ కళ్యాణ్.. తాను సీఎం అభ్యర్థి అయితేనే పొత్తు పెట్టుకోవాలని కొంతమంది చెబుతున్నారని.. తెలిపారు. అప్పుడు కనీసం 40 సీట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్లని అభిప్రాయపడ్డారు. కర్ణాటకలో కుమారస్వామి 30 సీట్లతో ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు. జనసేనకు కూడా 30-40 సీట్లు ఇచ్చే ఉంటే ఏపీలో కూడా కర్ణాటక తరహాలో పరిస్థితి ఉండేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 40 సీట్లలో గెలిపించినా సీఎం పదవి డిమాండ్ చేస్తానని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తే పదవి దానంతట అదే వస్తుందని తెలిపారు.
ఎర్లీ ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారని.. అందుకే జూన్ నుంచి ఇక్కడే అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. స్థానాల సర్దుబాటు పార్టీ బలంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో తమ బలం ఎక్కువ ఉందని.. కొన్ని జిల్లాల్లో తక్కువ ఉందని పేర్కొన్నారు. పట్టున్న ప్రాంతాల్లో జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని వెల్లడించారు. సీఎం పదవి వరించి రావాలని.. కోరుకుంటే అయ్యేది కాదని తెలిపారు. కండీషన్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి సాధించలేమని పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీని, టీడీపీని అడగనని అన్నారు. తన సత్తా ఏంటో చూపించి పదవి అడుగుతానని తెలిపారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ ఏర్పాటు చేయలేదని తెలిపారు. వైసీపీ నుంచి అధికారం తీసేసుకుని ప్రజలకు అధికారం అప్పగించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.