Pawan Kalyan on Ruya | తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటన అమానవీయమైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రుయా దవాఖానలో దయనీయ ఘటనకు సర్కార్ వైఖరే కారణం అని మంగళవారం ఆరోపించారు. ఉచిత అంబులెన్స్ సేవలు నిలిపేయడంతో నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని భుజాన వేసుకుని 90 కి.మీ. దూరం బైక్పై వెళ్లిన ఘటన కలిచి వేసిందన్నారు. నరసింహ కుటుంబానికి పవన్ కల్యాణ్ ప్రసాగ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు విధుల్లో ఉన్న దవాఖాన సీఎస్ఆర్ఎంతో సరస్వతిదేవిని సస్పెండ్ చేసి, సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసు ఇచ్చి సర్కార్ చేతులు దులిపేసుకుందని వ్యాఖ్యానించారు.
విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్లు రోగులకు చికిత్స చేయాలా.. అంబులెన్స్లు సమకూర్చాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. దవాఖాన పరిపాలనా విభాగాన్ని పటిష్ఠం చేయనందువల్లే ఈ దారుణాలు జరుగుతున్నాయన్నారు. ఇంతకుముందు కరోనా మహమ్మారి వేళ ఆక్సిజన్ లేక 30 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. కడప రిమ్స్లో విద్యుత్ కోతల వల్ల పిల్లలు మృతి చెందారన్నారు. రాష్ట్ర సర్కారీ దవాఖానల్లో మౌలిక వసతుల కొరత వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతుల గురించి బలంగా మాట్లాడిన నర్సీపట్నం ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ సుధాకర్ను వేధించడంతో ఆయన మరణించారని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ఘటనలన్నీ సర్కారీ వైఫల్యాన్ని చూపుతున్నాయని స్పష్టం చేశారు. వైద్య రంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతున్నదని వ్యాఖ్యానించారు. కన్నవారి కడుపుకోత అర్ధం చేసుకోలేని స్థాయికి దవాఖానాల చుట్టూ రకరకాల మాఫియాలు చేరాయని, వాటిని పెంచి పోషిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.