కాకినాడ : జనసేన అధినేత పవన్ కల్యాణ్పై, ఆయన పార్టీపై మంత్రి దాడిశెట్టి రాజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తితో పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించలేదని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడును అధికారంలోకి తేవడం కోసమే అని ఎద్దేవా చేశారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎప్పుడు కష్టమొచ్చినా తానున్నానంటూ పవన్ ముందుకు వస్తున్నారని, ఆ విధంగానే పవన్ అడుగులు వేస్తున్నారని దుయ్యబట్టారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇద్దరు కలిసి చిత్ర విచిత్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా పవన్ విన్యాసాలు ఉన్నాయని చురకలంటించారు. పవన్కు దమ్ముంటే అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. వివిధ సర్వేల ఫలితాల్లో ప్రజల పల్స్ చూసి పవన్, చంద్రబాబులకు వణుకుపుడుతున్నదని అన్నారు.