Pawan Kalyan | `ఎవరైనా గెలిచినా కొద్దీ ఎవరైనా బలపడతారు. కానీ మేం ఓడినా కొద్దీ బలపడతాం` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రెండున్నర దశాబ్దాలుగా ఆలోచించిన తర్వాత తాము సిద్ధాంతాలు రూపొందించామని అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో జరిగిన జనసేన పదో ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ తనకు ఒక్కసారి అండగా నిలబడండి.. కులాన్ని దాటి ముందుకు రండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. మానవత్వాన్ని నిలబెట్టడానికి, సమాజంలో పరివర్తన తేవడానికి జనసేన నిలబడుతుందని ప్రకటించారు. సమాజ పరివర్తన కోసం యువత ముందుకు రావాలన్నారు.
తాను పుట్టిన కులాన్ని గౌరవిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ఇప్పటి వరకు కాపులకు అధికారం రాలేదన్నారు. ఒక్కసారి కాపులకు అధికారం ఇవ్వాలని, అప్పుడు చేసి చూపుతాం అని పేర్కొన్నారు. కాపులు పెద్దన్న పాత్ర వహించాలని పిలుపునిచ్చారు. కాపులు ఎదగడానికి కమ్మ, రెడ్లతో గొడవ నుంచి పడనవసరం లేదన్నారు. ఇతర బీసీలను, ఎస్సీ, ఎస్టీలను కలుపుకుని ముందుకెళ్లేందుకు కాపులు పెద్దన్న పాత్ర వహించాలన్నారు. బలహీనవర్గాల కులాలకు అండగా నిలిచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
గతంలో తాను కమ్మ, కాపులు, బీసీలు, దళితులు, అని కులాల పేర్లు చెప్పడానికి నేను బాధపడేవాడినని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పీడితుల పక్షం నిలిచి మనిషి రుణం తీర్చుకోవాలి. అందుకే సమాజానికి కులాల ఐక్యత అవసరం అని అన్నారు. అభివృద్ధి కోసం నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలన్నారు.
క్రిమినల్ పాలిటిక్స్ నుంచి రాష్ట్రాన్ని బయట పడేయాలంటే కాపులు, యాదవులు, గౌడ సోదరులు, ముస్లింలు, అన్ని కులాలు, మతాల వారు ఐక్యంగా ముందుకు రావాలని పవన్ కల్యాణ్ చెప్పారు. కులాల మధ్య ఐక్యత లేకపోతే మళ్లీ అరాచకమే రాజ్యమేలుతుందని తెలిపారు. కొందరు నేతలు తొడలు కొడుతున్నారని, అధికారం నుంచి తొలగించాక వారి సంగతి తేలుస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.