కృష్ణా జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి కోరారు. విభజన కారణంగా తమ రాష్ట్రం విపరీతంగా నష్టపోయిందని, ఆ మేరకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం భీమవరం పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గన్నవరం విమానాశ్రయంలో జగన్ వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా ఆయనకు జగన్ ఒక వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనతో తీవ్రంగా నష్టపోయిందని, రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వడం ఒక్కటే పరిష్కారమని ఏపీ సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానిని కోరారు. తెలంగాణ డిస్కంల నుంచి ఏపీకి రావల్సిన రూ.6,627 కోట్లు ఇప్పించాలని, రూ.34,125.5 కోట్లు రిసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఏపీకి ఇస్తున్న రేషన్లో హేతుబద్దత కరువైందని, రాష్ట్రానికి మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రధానికి అందజేసిన వినతిపత్రంలో కోరారు.
ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రధానిని ఏపీ సీఎం జగన్ కోరారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన క్లియరెన్సులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీఎండీసీకీ ఇనుప గనులు కేటాయించాలని కూడా కోరారు.