అమరావతి : ఏపీలో భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గద్దె దించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ( Chandra Babu) పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
రాష్ట్రాన్ని నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని, ఆ బాధ్యత ప్రజలందరిపై ఉందని అన్నారు. ప్రశ్నించిన వారిని వేధించడమే సీఎం జగన్ (CM Jagan) పనిగా పెట్టుకున్నారని, తాగునీటి కోసం ట్రాక్టర్తో చంపించిన ఘనుడని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చే పార్టీ అని స్పష్టం చేశారు. రాష్ట్రం, ప్రజలపై ఎలాంటి గౌరవం లేని వ్యక్తి సీఎంగా ఉండేందుకు ఏమాత్రం అర్హత లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రాబోయేది టీడీపీ(TDP) , జనసేన(Janasena) కూటమియేనని దీమాను వ్యక్తం చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు(Murder Case) ను ఎందుకు తేల్చలేదని జగన్ చెల్లెలు సునీత ప్రశ్నించారని, బాబాయ్ హత్యపై సమాధానం చెప్పేందుకు ఎందుకు సిద్ధంగా లేవని ప్రశ్నించారు. ధైర్యంగా మాట్లాడితే ఆమెపైనా కేసులు పెట్టి వేధించారని, నేర స్వభావం ఉన్న వ్యక్తులు ఎలాంటి నీచానికైనా దిగజారుతారని విమర్శించారు.