అమరావతి : ఏపీలో జగన్ పాలన అంతా రివర్స్ పరిపాలన కొనసాగుతుందని బీజేపీ ఏపీశాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం గణతంత్ర వేడుకల సందర్భంగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని వెల్లడించారు. తమ మానిఫెస్టోలో కూడా ఏపీలో 23 జిల్లాల ఏర్పాటు ఉందని అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై కొంత చర్చ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాల సరిహద్దుల విషయంలో కొన్ని చోట్ల ఇబ్బందులు వస్తాయని అన్నారు.
పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఐఆర్ కంటే పీఆర్సీని తగ్గించి ఉద్యోగ వ్యతిరేక విధానాన్ని ప్రభుత్వం చాటి చెప్పిందన్నారు.ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తరహాలోనే పీఆర్సీ రివర్స్ చేసిందని విమర్శించారు.