అమరావతి : ఏపీలో తనను తాను అభిమన్యుడు కాదు, అర్జునుడినని చెప్పుకుంటున్న సీఎం వైఎస్ జగన్(YS Jagan) భస్మాసురుడని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆరోపించారు. ఆదివారం నెల్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ’ రా.. కదలి రా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగంలో ఏపీ 24శాతంతో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.
రైతు ఆత్మహత్యలో రాష్ట్రం అగ్రభాగాన ఉండడం విచారకరమని అన్నారు. మద్యం పేరుతో పేదల రక్తాన్ని తాగే వ్యక్తి జగన్కు, వైసీపీ రివర్స్ పాలనకు ప్రజలు రివర్స్ గిప్టు ఇచ్చే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలందరూ బాధితులేనని, వారే మాకు స్టార్ క్యాంపెయినర్లని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు.