అమరావతి : ఏపీలో జరుగనున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానిదే విజయమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu) పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ (YCP) ఐదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా , ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితికి తీసుకొచ్చారని ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు.
జగన్ (Jagan) విధ్వంసం వల్ల రాష్ట్రానికి రావలిసిన పరిశ్రమలు రాకుండా పోయాయని ఆరోపించారు. దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాక పొట్టతిప్పల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని వివరించారు. కన్నతల్లికే భారమైన వ్యక్తి జన్మభూమికి భారం కాదా అని జగన్ ఉద్దేశించి అన్నారు. మరోసారి కూటమి అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు.
సూపర్ సిక్స్ (Suprer Six) తో పాటు పవన్కల్యాణ్ సూచించిన మరికొన్ని పథకాలను సైతం పక్కాగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించామని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయాతీలకు నిధులు ఇచ్చి సర్పంచులకు సర్వాధికారాలు అందజేస్తామని ప్రకటించారు.