హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇంటిపై జరిగిన దాడిని ప్రజా సంఘాల చైర్మన్ గజ్జెల కాంతం (Gajjala Kantham) తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడినవారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు ప్రకటించడంపై అభ్యంతరం తెలపడాన్ని నిరసిస్తున్నామన్నారు.
కొనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పేందుకు నెల రోజుల సమయం కేటాయించింది. ఈ నేపథ్యంలో జిల్లా పేరును మారమార్చొద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి అమలాపురంలో మంగళవారం భారీఎత్తున ఆందోళన నిర్వహించింది. అదికాస్తా అదుపుతప్పి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటనతో సంబంధం ఉన్నవారు ఏ పార్టీకి చెందినవారైనా, ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని గజ్జల కాంతం డిమాండ్ చేశారు. మూడు రోజుల్లో అమలాపురం వెళ్తామని, దాడి జరిగిన ప్రాంతాన్ని సందర్శిస్తామని,
మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యేకు అండగా నిలుస్తామని ఆయన చెప్పారు.