Gaganyaan | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శనివారం ఉదయం 8.30 గంటలకు గగన్యాన్ టెస్ట్ వెహికల్ను ఇస్రో ప్రయోగించనుంది. దీని ద్వారా ‘క్రూ ఎస్కేప్ వ్యవస్థ’ పనితీరును పరీక్షించనున్నారు. భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ మిషన్ చేపట్టిన విషయం తెలిసిందే.
ఇందుకు సన్నాహకంగా పలు కీలక పరీక్షలను ఇస్రో చేపట్టనుంది. తొలుత క్రూ మాడ్యూల్ వ్యవస్థను పరీక్షించనున్నది. అనుకోని ప్రమాదం తలెత్తితే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఇందులో భాగంగా డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ని నింగిలోకి పంపనున్నారు. అయిదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేశారు. బంగాళాఖాతంలోకి పడేలా రూపకల్పన చేశారు.