అమరావతి : వైఎస్ వివేకా ( YS Viveka) హత్యా నిందితుడిని పక్కన పెట్టుకుని జగన్ ఓట్లు కోరడం సానుభూతి కోసమేనని వైఎస్ వివేకా కూతురు సునీత (Sunitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. కడప జిల్లా ప్రొద్దుటూర్లో వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో జగన్(YS Jagan) చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
‘ వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని చెబుతున్నారు. హత్య వెనుక అవినాష్, భాస్కర్రెడ్డి ఉన్నారని సీబీఐ చెబుతున్నా కూడా ప్రభుత్వం నిందితులకు భద్రత కల్పిస్తుందని ఆరోపించారు . ‘ గతంలో సీబీఐ దర్యాప్తు చేయాలని కోరి, తరువాత వద్దన్నారు. మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ (CBI) విచారణ కోరట్లేదా అని ప్రశ్నించారు.
నిందితుడిని పక్కన పెట్టుకుని ఓట్లు వేయాలని కోరుతున్నారు. మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా అని’ నిలదీశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తు రాలేదు. ఎన్నికలు రాగానే చిన్నాన్న గుర్తుకు వచ్చారు. సానుభూతి కోసమే ఎన్నికల వేళ వివేకా పేరును తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
నేను పోరాడేది న్యాయం కోసం. మీరు పోరాడేది పదవుల కోసమని అన్నారు. పదవులు ఆశించి రాజకీయాలు చేస్తున్నట్లు జగన్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. ఐదేళ్లపాటు చెల్లెళ్లు గుర్తు రాలేదా ? .. అన్నీ మరిచిపోయి ఓటు కోరేందుకు మనసెలా అంగీకరిస్తుందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడం సరికాదని సూచించారు. మీరు చేయాల్సిన పని సరిగా చేయనందనే బయటకు రావాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.