అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వైసీపీ ప్రభుత్వం అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఏపీ హైకోర్టు గత ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పుపై ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకు వెళ్లడంపై లోకేశ్ ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు.
అధర్మంపై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందని అన్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు పయ్యవుల కేశవ్ మాట్లాడుతూ అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మరోసారి భంగపడక తప్పదని అన్నారు. రైతుల సంకల్పం ముందు ప్రభు త్వ కుట్రలు చాలా చిన్నవని , ప్రభుత్వానికి చెంప చెల్లుమనిపించేలా సుప్రీంకోర్టులోనూ తీర్పు వస్తుందని తెలిపారు.
చట్టసభలను వక్రీకరించేలా హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వదని ఎంపీ కనకమేడల తెలిపారు. ప్రభుత్వం వేసిన పిటిషన్ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతోందని పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో నే హైకోర్టు తీర్పును వక్రీకరిస్తూ తప్పుబడుతున్నారని, రాజధాని నిర్మాణం చేపట్టకుండా 6 నెలలు కాలయాపన చేశారని ఆరోపించారు.