అమరావతి : ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం నేటితో 9వందల రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అమరావతి సాధన సమితి ఆధ్వర్యంలో మందడం దీక్షా శిబిరం వద్ద ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ , తాడకొండ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ తదితరులు హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
కోదండరాం మాట్లాడుతూ అమరావతి రాజధాని కోసం భూములిచ్చి త్యాగాలు చేసిన రైతుల పరిస్థితి నేడు దయనీయంగా మారిందని తెలిపారు. రైతుల కోరిక మేరకు అమరావతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు రైతుల హక్కులను, జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒక ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను మరో ప్రభుత్వం గౌరవించాల్సిన అవసరముందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు.
ప్రస్తుతం అమరావతిలో నిర్మించి నిలిపివేసిన భవనాలు చూస్తుంటే బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా హక్కులు సాధించుకోవచ్చని సూచించారు. అనంతరం రాజధాని కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.